13, జులై 2014, ఆదివారం

గురు పూర్ణిమ 

గురు బ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షా త్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురవే నమ: 
గురుపౌర్ణిమ. సందర్భంగా గురువులందరికీ నమస్సులు. 
ఈ ఆషాడ శుద్ధ పౌర్ణిమ రోజున (12 07 2014) గురుపౌర్ణిమ జరుపుకుంటారు. గురువులను పూజించి వారికి గురుదక్షిణ సమర్పించి వారి ఆశీ ర్వాదం పొందుతారు. 
ఆది గురువు వ్యాస మహర్షి పుట్టిన రోజు కూడా ఇదే కావటం వలన వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తుంటారు. నాలుగు వేదాలు రచించి వేద సంస్కృతిని మానవాళికి అందిం చిన తొలి గురువు వ్యాసుడు అందుకే ఆయనని వేద వ్యాసుడు అనికూడా అంటారు. 
మనమంతా “కృష్ణం వందే జగత్ గురుమ్” అని కీర్తించే ఆ శ్రీకృష్ణుల వారు కూడా సాందీపని మహర్షిని సేవించారని తెలుస్తోంది. 
గురువు అంటే జ్ఞానాన్ని అందించేవాడు. మనకి తెలియంది తెలిపేవాడు గురువే!
తొలి గురువు తల్లి అయితే జీవితాన ఎంతోమంది గురువులు ఎదురౌతుంటారు. 
షిరిడి సాయిబాబా, దత్తత్రేయులు, ఆదిశంకరాచార్యులు, సత్యసాయి బాబా, శ్రీ రామకృష్ణ, మొదలుకుని నేటి శ్రీ శ్రీ రవి శంకర్, గణపతి సచ్చిదానంద, ఇంకా ఎందరో గురువులు అందరికి అభివందనం.
ప్రతిరోజూ స్కూల్ ల్లో పాఠాలు చెప్పే టీచర్ ప్రత్యక్ష గురువు. వీరు జీవనోపాధికి మార్గాలు తెలిపే విద్యని బోధిస్తే ఆధ్యాత్మిక గురువులు జీవన్ ముక్తికి మార్గాలు బోధిస్తారు. 
జీవితంలో ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగిన . గురువులను గౌరవించటం, మర్యాదతో మెలగటం, నమస్కరించటం, పూజించటం వంటివి చేయాలి. 
శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం 
సూత్రా భాష్య కృతౌ వందే భగవంతౌ పున: పున: 
ఈ శ్లోకాన్ని ఈ వ్యాస పూర్ణిమ నాడు పఠించాలి. 
విష్ణువు అవతారంగా భావించే వేదం వ్యాసుని స్మరించాలి ఈ రోజు.శ్రీకృష్ణ ద్వైపాయనుడు అసలు పేరైన వ్యాసుడు భారత భాగవతాలనే కాకుండా అష్టాదశ పురాణాలు కూడా రచించాడు. 
ఈ గురుపౌర్ణమి రోజున ఆధ్యాత్మిక జీవనాన్ని కోరుకునే వారు గురువు వద్ద ఈ రోజునించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవటం ప్రారంభి స్తారు. రైతన్నలు కూడా వానలు కురిసి తమ పంటలు బాగా పండాలని కోరుకుంటారు. 
ఆధ్యాత్మిక గురువులు నేటినుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తారు. ఈ నాలుగు నెలలు ఏ ప్రాంతాలు సంచారం చేయకుండా ఒకే చోట వుండి తమ దీక్ష కొనసాగిస్తారు. ఈ నలుగు నెలలు ఒక్కో నెల ఒక్కో నియమాలతో ఆహార నియమాలు పాటిస్తారు. వేదవ్యాసుడు అందించిన జ్ఞానాన్ని తమ శిష్యులకి బోధిస్తారు. వేదాంత చర్చలలో పాల్గొంటారు. కొంతమంది ఈ రోజున పగలంతా ఉపవాసం వుంది చంద్రోదయం తరువాత దేవుని పూజించి తర్వాత భుజిస్తారు.దేశం అంతా వివిధ రకాలుగా జరుపుకునే ఈ వ్యాస పూర్ణిమ లేదా గురుపూర్ణిమ నాడు తమ గురువులను పూజించటం అనాదిగా జరుగుతోంది.
గురు వులుగా కొలవబడే ఆలయాలు నేడు వైభవంగా అలంకరించి ఆ విగ్రహమూర్తులను భక్తి శ్రద్దలతో కొలుస్తున్నారు. 
శిరిడి సాయిబాబా ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
శంకర మఠం, గురు రాఘవేంద్రస్వామి మఠం, రామకృష్ణ మఠం, ఉడిపి మఠాలు, ఉత్తరాది మఠం, శక్తి పీఠాలు, దత్త పీఠాలు, ... ఇలా ఎన్నో గురువుల శక్తి పీఠాలు ప్రజల పూజలందుకుంటున్నాయి.
                                                           శ్రీ గురుభ్యోం నమ: